భారత్లో ప్రఖ్యాత డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ తొలి అడుగు భాగ్యనగరంలో..
డిసెంబర్కల్లా వెయ్యి మందికి ఉద్యోగాలు
మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధుల భేటీ
కార్పొరేట్ కంపెనీల కేంద్రం హైదరాబాద్
సమర్థ, సుస్థిర సర్కారుకు ఇది నిదర్శనం
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బహుళజాతి సంస్థలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నది. ఇప్పటికే గూగుల్, అమెజాన్లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన దగ్గర కార్యాలయాలు ప్రారంభించగా.. అదే వరుసలో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డిజిటల్ టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్ కేంద్రంగా భారత్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్-1000 కంపెనీలకు డిజిటల్-నేటివ్ టెక్నాలజీ సేవలను అందిస్తున్న ఈ సంస్థ త్వరలోనే నగరంలో తమ కార్యాలయాన్ని ప్రారంభించనున్నది. దేశంలోనే తొలియూనిట్ను ఇక్కడే నెలకొల్పనుండగా, ఈ ఏడాది చివరికల్లా 1000మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సీఈవో లియోనార్డ్ లివ్షిట్జ్ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతో సోమవారం ప్రగతిభవన్లో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా గ్రిడ్ డైనమిక్స్ భారత్లో పెద్ద ఎత్తున విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కంపెనీ తమ కార్యకలాపాలకు నగరాన్ని ఎంచుకోవడంపై ఆయన హర్హం వ్యక్తంచేశారు.
గడచిన ఏడేండ్లలో అనేక బహుళజాతి కంపెనీలు, దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటుకావడాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. నగరం అందిస్తున్న అవకాశాలపై ప్రతినిధి బృందానికి వివరించారు. కంపెనీ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం బహుళజాతి కంపెనీలను ఆకర్షించడంలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని సమర్థ, సుస్థిర ప్రభుత్వానికి, నగరం అందిస్తున్న అద్భుతమైన మౌలిక సదుపాయాలకు, సమృద్ధిగా ఉన్న ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.
ఏడాది చివరికల్లా 1000మందికి ఉద్యోగాలు
హైదరాబాద్లో అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలతోపాటు అద్భుతమైన ఏ-గ్రేడ్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని గ్రిడ్ డైనమిక్స్ సీఈఓ లియోనార్డ్ లివ్స్చిట్జ్ ప్రశంసించారు. ఉన్నత విద్యాప్రమాణాలు, నిపుణులైన ఇంజినీర్లకు ఇక్కడ కొదవలేదని, అందుకే భారత్లో సంస్థ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణను ఎంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా తొలి యూనిట్ ద్వారా సుమారు 1000మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఆయన వెల్లడించారు. గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఫార్చ్యూన్-1000 కంపెనీలకు డిజిటల్-నేటివ్ టెక్నాలజీ సేవలను అందిస్తున్నది. డేటా అనలెటిక్స్, శోధన, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ మైగ్రేషన్, అప్లికేషన్ ఆధునికీకరణలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టింగ్ సేవలను అందిస్తున్నది. 2006లో అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థాపించిన ఈ సంస్థ మెక్సికో, యూకే, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్తోపాటు మధ్య, తూర్పు ఐరోపాలోని పలు దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా భారత్కు తన కార్యకలాపాలు విస్తరించింది.
కుల, మతాలను పక్కన పెడితేనే
యంగ్ ఇండియా సాధ్యం: మంత్రి కేటీఆర్
యంగ్ ఇండియా కల సాకారం కావాలంటే కుల, మతాలను పక్కన పెట్టాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. “భారతదేశాన్ని ప్రపంచంలో సముచిత స్థానంలో నిలిపే మార్గాలను అన్వేషించాలి. డెవలప్మెంట్ నేషనలిజం యువత ఎజెండాగా ఉండాలి. ప్రపంచంలో అత్యుత్తమమైన వాటితో భారత్ పోటీపడాలి. ఇది ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు’ అని పేర్కొన్నారు.