హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని జనన, మరణాలకు కూడా డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను జారీచేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఏర్పాట్లు చేసున్నది. ఇకపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు జనన, మరణ వివరాలన్నింటినీ http://ubd. telangana.gov.in వెబ్సైట్లో నమోదుచేయాల్సి ఉంటుంది. ఆ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ దవాఖానల్లో జననాల వివరాలను ఈ వెబ్సైట్లో నమోదుచేస్తారు. పంచాయతీరాజ్శాఖ అధికారులు ప్రతి గ్రామ పంచాయతీకి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆయా గ్రామాల్లో జన్మించిన, మరణించిన వారి ధ్రువపత్రాలను దరఖాస్తుదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీ -సేవ, ఈ- సేవ కేంద్రాల ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం ఇప్పటివరకు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనే ఉన్నది. ప్రస్తుతం అత్యధిక పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు జనన, మరణాల వివరాలను పుస్తకాల్లో నమోదుచేసుకొని, మాన్యువల్గా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు. ఇక వెబ్సైట్తో పాటు పుస్తకాల్లోనూ జనన, మరణ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లోని వివరాలను అధికారిక సమాచారంగా పరిగణించి, చనిపోయిన వారికి రైతుబందు, ఆసరా పింఛన్లు నిలిపివేస్తారు. ఈ సమాచారాన్ని ఇతర శాఖలు కూడా ఉపయోగించుకోనున్నాయి. ఇప్పటివరకు 137 గ్రామ పంచాయతీలు మాత్రమే డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను జారీచేస్తున్నాయి.