Diabetes | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఫంక్షనల్ ఆహారంతో డయాబెటిక్ వల్ల వచ్చే కంటి సమస్యలను నియంత్రించడానికి ఆస్కారం ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలింది. ఫంక్షనల్ ఫుడ్ (ఆహార పదార్థాల మిశ్రమం)గా పిలిచే ఆహారంతో డయాబెటిస్ సోకిన ఎలుకల కంటి చూపు మెరుగుపడిందని పరిశోధనల్లో వెల్లడైంది.
‘మిటిగేషన్ ఆఫ్ లెన్స్ ఓపాసిఫికేషన్ బై ఏ ఫంక్షనల్ ఫుడ్ ఇన్ ఏ డయాబెటిక్ రోడెంట్ మోడల్’ పేరిట సైన్స్ డైరెక్ట్ జర్నల్లో పరిశోధన ఫలితాన్ని ప్రచురించారు. ఎన్ఐఎన్ పరిశోధకుల బృందం సీనియర్ సైంటిస్ట్ భానుప్రకాశ్రెడ్డి సారథ్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉసిరి, పసుపు, బ్లాక్ పెప్పర్, దాల్చిన, అల్లం, మెంతులతో చేసిన ఫంక్షనల్ ఫుడ్ను ఆహారంగా 20 వారాలపాటు ఎలుకలకు అందించగా, డయాబెటిస్ ప్రభావం తగ్గినట్టుగా పరిశోధకులు గుర్తించారు.
ఫంక్షనల్ ఫుడ్ తీసుకున్న ఎలుకల్లో కంటి శుక్లాల సమస్య పెరగడం ఆగిపోయినట్టు గుర్తించారు. 2045 నాటికి మధుమేహుల సంఖ్య 783 మిలియన్లకు చేరుతుందని అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతుండగా, ఆహార నియమాలతోనే డయాబెటిస్కు కళ్లెం వేయొచ్చని ఈ పరిశోధనలో తేలింది.