ఎదులాపురం, ఫిబ్రవరి 21 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లో మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లో కాంటా వేయకుండా డీలర్లకు బియ్యం పంపిణీ చేయడంతో ఒకటి నుం చి రెండు కిలోలు తరుగు వస్తుండటంపై డీలర్లు ఆందోళన వ్యక్తంచేశారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చే ప్రతి 50 కిలోల బస్తాలో ఒకటి నుంచి రెండు కిలోల బియ్యం తరుగు వస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం కిలో రూ.29, కంది పప్పు, మిగతా సరుకులను రేషన్ షాపు నుంచి సరఫరా చేయాలని కోరారు. అనంతరం డీఎస్వో కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు.