హైదరాబాద్ : ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించలేదని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైనా వేరియంట్ కేసు వచ్చినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మీడియా ద్వారానే తెలియజేస్తుందన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం కానీ, దాచాల్సిన అవసరం లేదన్నారు. ఎయిర్పోర్టుల్లో నిఘాను బలోపేతం చేశామన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 12 దేశాలను ఎట్ రిస్క్ కంట్రీస్గా గుర్తించిందని, ఆయా దేశాల నుంచి ప్రయాణికులందరికీ కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తామన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను గచ్చిబౌలిలోని టిమ్స్ ఐసోలేషన్ సెంటర్కు తరలించి, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 12 రిస్క్ దేశాల నుంచి 41 మంది ప్రయాణికులు వచ్చారన్నారు. ఇందులో యూరప్ 22 మంది, యూకే నుంచి 17 మంది, సింగపూర్ నుంచి ఇద్దరు రాగా.. వీరందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశామని, ఇందులో ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు వారిని హోం క్వారంటైన్కు తరలించామన్నారు. రాబోయే 14 రోజులు వారి ఆరోగ్యాన్ని హెల్త్ కేర్ సిబ్బంది పరిశీలిస్తారని, ఎవరికైనా లక్షణాలు ఉంటే వారితో పాటు కాంటాక్టులకు పరీక్షలు చేస్తామన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నమూనాలను ర్యాండమ్గా సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించడం జరుగుతుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించి పూర్తిగా సమాచారం లేదన్నారు. ప్రాథమికంగా చాలా అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉన్నదన్నారు.
డెల్టా వేరియంట్ కంటే సుమారు ఆరు రెట్లు ఉధృతంగా వ్యాపించే గుణం సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో స్వల్ప లక్షణాలతో కేసులు నమోదయ్యాయని, హాస్పిటల్లో చేరే కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. కరోనా నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో వేరియంట్లు అల్ఫా, బీటా, గామా వేరియంట్, డెల్టా వేరియంటట్లు చూశామన్నారు. ఇందులో ప్రపంచాన్ని వణికించింది డెల్టా వేరియంటేనన్నారు. వైరస్లో మ్యుటేషన్లు జరుగుతుంటాయని, ఇప్పటి వరకు మూడు లక్షలకుపైగా మ్యుటేషన్లు కరోనా వైరస్లో జరిగాయన్నారు.
రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయని, అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కొత్త వేరియంట్పై దిశానిర్దేశం చేశారని, సీఎం చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైందని పేర్కొన్నారు.