హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు స్టేటస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెలికాన్ సిగ్నల్స్ తదితర ఏర్పాట్ల పనితీరు గురించి అధికారులతో చర్చించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(సీడీఈడబ్ల్యూ) సెంటర్లలో అదనంగా మరో మూడింటిని మంజూరు చేయాలని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలోని చౌటుప్పల్, భువనగిరి, సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో సీడీఈడబ్ల్యూ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి తరఫున డీసీపీ డీ కవిత ప్రాజెక్ట్ పరిస్థితిని వివరించారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖా గోయల్, శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేశ్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు అవినాశ్ మహంతి, సుధీర్బాబు, డీసీపీలు ఉషా విశ్వనాథ్, కే సృజన, డీ సాయి శ్రీ, జీహెచ్ఎంసీ డీఈ మమత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి అఖిలేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.