బాలానగర్, ఏప్రిల్ 16 : కనీస జాగ్రత్తలు పాటించకపోతే ప్రతి ప్రయాణం ప్రమాదకరమేనని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన… ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై నిర్వహించిన అలైవ్… అరైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వాహనదారుడూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. సీటు బెల్టు, హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్లో వెళితే విలువైన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హత్యల ఘటనల్లో ఏడాదికి సగటున 800 మంది మృత్యువాత పడితే… రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది చనిపోతున్నారని వెల్లడించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు జోగుళాంబ గద్వాల డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి హెల్మెట్లు పంపిణీచేశారు.