హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): మైక్రోఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై తమకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ను సోమవారం కలిసిన బాధితులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈ వ్యవహారంలో హేమకాంత్రెడ్డి, రమావత్ మధు, బాలాజీ నాయక్ తదితరులపై బాధతులు తీవ్ర ఆరోపణలు చేశారు. అధిక వడ్డీలు, బెదిరింపులు, మానసిక ఒత్తిళ్లు కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయాయని తెలిపారు. దాదాపు 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం ఉందని డీజీపీతో చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరగా.. డీజీపీ స్పందిస్తూ.. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత ఉందో త్వరలోనే విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.