హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ క్యాడర్కు పనిచేస్తున్న ఇతర రాష్ర్టాలకు చెందిన మావోయిస్టులు అందరూ పలు దఫాలుగా లొంగిపోవడంతో తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించినట్టు డీజీపీ బీ శివధర్రెడ్డి వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం 42 మంది మావోయిస్టులు ఆయన ఎదుట లొంగిపోయారు. మొత్తం 36 ఆయుధాలతోపాటు 800 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించి వారు జనజీవన స్రవంతిలో కలిసారు. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్, డీకేఏసీజేడీసీ సభ్యుడు సోడి మల్ల అలియాస్ కేషాల్ అలియాస్ నిఖిల్.. ఎస్సీఎం, జేఎంఎండబ్ల్యూపీ డివిజనల్ కమిటీ కార్యదర్శి చాప నారాయణ అలియాస్ గజేందర్ అలియాస్ మధు, బీకే-ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్డి సన్ను అలియాస్ మంతు సహా 42 మంది మావోయిస్టులు ఉన్నారు.
లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన కుంజం ఇడుమల్ అలియాస్ మహేందర్ మినహా అందరూ ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందినవారే. ఈ 42 మందికి కలిపి మొత్తం రూ.1.93 కోట్ల రివార్డును అందజేస్తున్నామని డీజీపీ తెలిపారు. వీరి లొంగుబాటుతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) పూర్తిగా కనుమరుగైందని డీజీపీ తెలిపారు. మావోయిస్టులతో సంప్రదింపులు జరిపి, వారు లొంగిపోయేందుకు కృషి చేసిన ఇంటెలిజెన్స్ విభాగాన్ని డీజీపీ అభినందించారు.
తెలంగాణ రాష్ర్టానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి సహా ఇంకా అజ్ఞాతంలో ఉన్న పసునూరి నరహరి, జాడే రత్నబాయి, వార్తా శేఖర్, రంగబోయిన భాగ్య తక్షణమే లొంగిపోవాలని డీజీపీ సూచించారు. రెండున్నరేండ్ల క్రితం తెలంగాణకు చెందిన మావోయిస్టులు 125 మంది అజ్ఞాతంలో ఉంటే.. ప్రస్తుతం వారి సంఖ్య ఐదుకు పరిమితమైందని చెప్పారు. వారిలో సీసీ మెంబర్లు ఇద్దరు, స్టేట్ కమిటీ మెంబర్లు ఇద్దరు, ఒక ఆర్సీఎం ఉన్నట్టు తెలిపారు. 2024 నుంచి నేటి వరకూ మొత్తం 761 మంది మావోయిస్టులు లొంగపోయారని, వారిలో నలుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు, 21 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు మొత్తం 302 ఆయుధాలు అప్పగించారని, వాటిల్లో అత్యధికంగా ఏకే-47లు 54 ఉన్నట్టు తెలిపారు. మావోయిస్టులకు హెల్త్కార్డులు ఇస్తున్నామని, ఆ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుందని డీజీపీ చెప్పారు. మావోయిస్టులు అడవుల్లో అమర్చిన మందుపాతరలను వారితోనే వెలికి తీయిస్తున్నామని, వాటి వల్ల సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని అన్నారు. గాదె ఇన్నయ్య కేసులో మావోయిస్టు సానుభూతిపరులపై ఎన్ఐఏ ఉపా కేసులు పెట్టి చేస్తున్న విచారణ కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని డీజీపీ స్పష్టంచేశారు. మావోయిస్టులకు ఆధార్కార్డులు, పాన్కార్డులు ఇప్పించి, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్, గ్రేహౌండ్స్ డీజీ అనిల్కుమార్, హోంగార్డ్స్ డీజీ స్వాతీలక్రా, ఎస్ఐబీ ఐజీ సుమతి, సిబ్బంది ఉన్నారు.