హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన తప్పనిసరి అని, పరిష్కార మార్గాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. హైదరాబాద్లోని టీహబ్లో ఆదివారం ‘సైబర్ కాన్షియస్ డే’ సందర్భంగా నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడారు. ప్రజలు, సాంకేతిక నిపుణులు చొరవతో పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.
తాము చూపిన పరిష్కార మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సైబర్ క్రైమ్స్ తీరు తెన్నులపై చర్చ జరపాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనా విధానం కూడా ఒక్కోసారి పరిష్కారం చూపుతుందని తెలిపారు. ఐటీ నిపుణులతో రిటైర్డ్ డీజీపీ మహేందర్రెడ్డి కూడా ఈ సందర్భంగా చర్చించారు. కార్యక్రమంలో పలువురు సైబర్ నిపుణులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు తమ ఆలోచనలను పంచుకున్నారు.