హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ యేడాది 9.67% అగ్నిప్రమాదాలు తగ్గాయని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు. శనివారం అగ్నిమాపక శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ దేశంలోనే అతిపెద్ద ఫైర్ సర్వీసెస్లలో ఒకటిగా అవతరించిందని చెప్పారు. అగ్నిమాపకశాఖలో 137 ఫైర్స్టేషన్లు, 9 ఫైర్ అవుట్ పోస్టులు ఉండగా, 33 జిల్లాల్లో 2,734 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం తొలిసారిగా అగ్నిమాపకశాఖలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్)ను తీసుకొచ్చినట్లు నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల సంభవించిన వరదల్లో ఎక్కువమందిని కాపాడేందుకు తమ సిబ్బంది అహర్నిశలు కృషి చేసినట్లు తెలిపారు. ఈ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో తోడు అగ్నిమాపక సిబ్బంది సుమారు 1,421 మందిని వరదల నుంచి రక్షించినట్టు వెల్లడించారు. ఈ ఏడాది పదివేలకు పైగా అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. 4,445 మాక్ డ్రిల్స్ తమ శాఖ నిర్వహించిందని చెప్పారు. టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా 26 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను నియమించామన్నారు.