తాడ్వాయి, డిసెంబర్ 12: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఆధారాలు చూపిస్తేనే అనుమతిస్తున్నారు. వేసుకోని వారికి అక్కడే వ్యాక్సిన్ వేసి అమ్మవార్ల దర్శనానికి పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు వనదేవతల సన్నిధిలో ఆదివారం డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. భక్తులకు అవగాహన కల్పించేలా పలు సూచనలతో కూడిన కరపత్రాలను అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఆలయ ఈవో రాజేంద్రంతో కలిసి అందించారు. మొదటి డోసు వేసుకున్న వారికి రెండోది, అసలే వేసుకోని వారికి మొదటి డోసు వేసి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి బుధ, గురు, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్వో తెలిపారు.