ధర్మపురి/జగిత్యాల : హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యతం వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకొని గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు.
పట్టణానికి చెందిన మహిళలు వేకువజామున 4 గంటల నుంచే గోదావరి నది స్నానఘట్టాల వద్దకు చేరుకొని పవిత్రస్నానాలాచరించి గోదావరిలో దీపాలను వదిలి భక్తిప్రవత్తులు చాటుకున్నారు..
గోదావరి పౌరోహితులచే సంకల్పాది పూజలు చేయించుకున్నారు.
అనంతరం భక్తులు ప్రధాన దేవాలయమైన లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంతో పాటు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయం, శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీవేణుగోపాల స్వామివారి ఆలయంలో బారులు తీరారు. తమ ఆరాధ్యదైవమైన లక్ష్మీనరసింహస్వామివారిని కనులారా వీక్షించేందుకు గంటల తరబడి బారులు తీరారు.
దీంతో దక్షిణ కాశీగా భాసిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలో కార్తీకశోభ సంతరించుకుంది. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు ధర్మపురికి చేరుకున్నారు.
స్వామివారికి నిర్వహించే వివిధ సేవల్లో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఆలయంలో ఉసిరిక చెట్టువద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.