యాదాద్రి, సెప్టెంబర్ 25 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 5 వరకు ఉత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. తొమ్మిది రోజులపాటు పూజల్లో పాల్గొనే దంపతులు రూ.1,116, నవరాత్రిలో ఒక్కరోజు సప్తశతి పారాయణానికి రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116 చెల్లించాలని సూచించారు.
నవరాత్రి పూజల్లో పాల్గొనే దంపతులకు ఐదు లడ్డూలు, అమ్మవారి ప్రసాదం ఇస్తామన్నారు. దీంతోపాటు ఐదుగురికి ఉచిత భోజన అవకాశం కల్పిస్తామని చెప్పారు. పూజా టికెట్లు దేవస్థాన బుకింగ్ కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు. ప్రధానాలయంతోపాటు రామలింగేశ్వరస్వామి ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం తొలిసారిగా జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇందుకు రామలింగేశ్వరాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉపాలయం వద్ద అమ్మవారికి మండపం, హోమ గుండాన్ని నిర్మించినట్టు ఈవో తెలిపారు.