సిద్దిపేట రూరల్, నవంబర్ 22 : తెలంగాణలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని జమ్ముకశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (డీడీసీ), బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (బీడీసీ) చైర్పర్సన్ల బృందం ప్రశంసించింది. ఊరూరా ప్రగతి పరుగులు పెడుతున్నదని, తెలంగాణ సర్కారు పనితీరు ఎంతో బాగున్నదని వారు మెచ్చుకున్నారు. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీలో శిక్షణ తరగతులకు హాజరైన 30 మందితో కూడిన జమ్ముకశ్మీర్కు చెందిన డీడీసీ, బీడీసీ చైర్పర్సన్లు మంగళవారం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్లో పర్యటించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశమై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. పనుల నివేదిక, ఆదాయ మార్గాలను సర్పంచ్ రమేశ్ వారికి వివరించారు. అనంతరం డంపింగ్ యార్డు, రైతువేదిక, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రైతు సంక్షేమ పథకాలను జడ్పీటీసీ శ్రీహరిగౌడ్ ఆ బృందానికి వివరించారు. పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల రక్షణ కోసం గ్రామాల్లో 32 సీసీ కెమెరాల ఏర్పాటు, 5 వేల జనాభాకు అనుగుణంగా చేపడుతున్న సీసీ రోడ్లు, ఇంటింటికి మొక్కల పంపిణీ, రోడ్డు వెంట మొక్కల పెంపకం గురించి వారు తెలుసుకున్నారు.