హైదరాబాద్ : దేశాన్ని స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా లేదు.. కానీ, మనం ఎవరి దేవుడు గొప్ప అనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. అది మానేసి ఇప్పటికైనా దేశాన్ని అత్యుత్తమంగా నిలిపే అంశాలపై దృష్టి సారిద్దామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విట్టర్లో ఓ నెటిజన్ నుపూర్శర్మను వెనకవేసుకొచ్చే పనిలోభాగంగా మంత్రి కేటీఆర్ను ప్రశ్నిస్తూ మీకు ఇస్లామోఫోబిక్ (ముస్లింలు అంటే భయం) ఎక్కువ అంటూ ట్వీట్ చేశారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఆస్క్ కేటీఆర్లో ‘నుపుర్ శర్మ ప్రసంగాన్ని అడ్డం పెట్టుకొని జరిగిన భారతదేశ వ్యతిరేక నిరసనలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు. నిరక్షరాస్యులైన కొందరు మైనారిటీలు మన జాతీయజెండాపై అశోక్చక్ర స్థానంలో ఉర్దూ రాయడాన్ని దేశం మొత్తం చూసింది. మీరు వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. ఓటు బ్యాంక్ కోసమా..?’ అని కేటీఆర్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నుపూర్ శర్మ చేసిన పని గొప్ప భారత దేశానికి అవమానం కలిగించింది.
ప్రపంచానికి మనల్ని చెడ్డగా చూపింది. ఆమెలాంటి పెద్దవాళ్లకు మద్దతివ్వడం అంటే మరింత సిగ్గుచేటు’ అని సమాధానం ఇచ్చారు. దీనిపై ఆదివారం స్వరాజ్య కన్సల్టింగ్ ఎడిటర్ అండ్ కాలమిస్ట్ ఆనంద్రంగనాథన్ నుపూర్శర్మ ఇస్లామిక్ గ్రంథాల నుంచి కోట్ చేస్తూ చెప్పిన మాటలు ఈ గొప్ప దేశానికి అవమానం కలిగించిందని అనుకోడానికి కారణం మీకు ఇస్లామోఫోబిక్ ఎక్కుగా ఉన్నందుకే కేటీఆర్’అని ట్వీట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఆనంద్ జీ.. నా దేశ అభివృద్ధి, సంక్షేమం నేను నమ్మే మతం. నేను డెవలప్మెంట్ నేషనలిస్ట్ను.
నుపూర్ చేసిన వ్యాఖ్యలపై ఇతర దేశాలకు ఎందుకు క్షమాపణలు చెబుతున్నారో యూనియన్ గవర్నమెంట్ను నడిపిస్తున్న వారిని అడగండి. మీరు అన్నట్లు నుపూర్ చేసింది సరైనదైతే ఆమెను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు..? అని ప్రశ్నించారు. బై ది వే నా పేరు రామ్.. ఒక నెల క్రితం భారత రాష్ట్రపతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందించిన దేశంలో మనం జీవిస్తున్నామనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు, కరెంటు ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘ఎవరి దేవుడు గొప్పవాడు..?’ అనే అంశంపైనే మన దృష్టి ఉంది. ప్రపంచంలో అత్యంత వైవిధ్యమైన భారతదేశంలో అనేక దేవుళ్లు, లక్షలాది ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటికీ మనకు తగినన్ని విద్యా సంస్థలు , ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేవు. ఇప్పటికైనా దేశాన్ని అత్యుత్తమంగా నడిపించే అంశాలపై దృష్టి సారిద్దాం’ అంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.
కాసేపటికి కేటీఆర్ ట్వీట్పై ఆనంద్ స్పందిస్తూ.. ఇది నేను అహంకారంతో మాట్లాడం లేదు. మీ మంచికోసమే చెబుతున్నా. ఎందుకంటే చివరకు మీరు రాహుల్గాంధీలా మారిపోతారేమోనని. వాస్తవాలు చెప్పకుండా గోల్పోస్టు షిప్టింగ్ (అసలు విషయాన్ని లేదా చర్చను పక్కదారి పట్టించడం) చేయొద్దు. రాజవంశాల నుంచి వచ్చిన వారి ఇలాగే ఉంటారనే నా భయం నిజమైంది. అని ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ‘ఆనంద్.. దుష్ట మూర్ఖత్వం కంటే రాజవంశం ఏ రోజుకైనా మంచిదే.
అలాగే మీ పే మాస్టర్ జుమ్లాకింగ్ (ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి) గోల్పోస్ట్ షిప్టింగ్ అనేది బాగా సరిపోతుంది. దయచేసి 2022లోపు పెట్టుకున్న లక్ష్యాలను మార్చుకోవొద్దని మీ గురువు మోదీ జీకి చెప్పండి. మీకు కావాలంటే నేను బీజేపీకి చెందిన అన్ని రాజవంశాల జాబితాను పంపిస్తాను’ అని రిప్లయ్ ఇచ్చారు. దీనిపై ఆనంద్.. ఇక ఇక్కడితో ఆపాలని నా సలహా.. మీరు మూర్ఖత్వాన్ని ఈ స్థాయికి తీసుకెళ్తున్నారు. రాహుల్గాంధీ కూడా ఈ విషయంలో మీతో పోల్చుకోడానికి సిగ్గుపడతారు.
ఒకవేళ డేవిడ్ ధావన్ (ప్రముఖ దర్శకుడు) ‘ఇంటర్నేషనల్ ఎంబరాస్మెంట్-నెంబర్1 సినిమా చేస్తే.. హీరో ఎవరు అవుతారో నాకు తెలుసు. ఇక బై..’ అని చెప్పారు. దీనికి మంత్రి కేటీఆర్ డేవిడ్ ధావన్ ‘ఇంటర్నేషనల్ ఎంబరాస్మెంట్-నెంబర్1’పై నిసిమా చేస్తే.. హీరో అయ్యే ప్రత్యేకత ఒకరికే ఉంది. డోనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి తననుతాను జోకర్ చేసుకున్న ఆ వ్యక్తి.. బిర్యానీ కోసం పిలవకుండానే పాకిస్థాన్ వెళ్లిన వాడు.. తన ఫ్రెండ్ కోసం ప్రాజెక్ట్ అంగీకరించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని బలవంతం చేసిన ఆయనే ఇందులో హీరో’ అంటూ మరో ట్వీట్ చేశారు.