హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖకు చెంది న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని గెజిట్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశా రు. అన్యాక్రాంతమైన భూముల పరిరక్షణ కో సం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఇప్పటివరకు 5,050 ఎకరాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో నిజామాబాద్ సమీపంలో మహారాష్ట్ర పరిధిలో 70 ఎకరాలు ఉండటం విశేషం.
దేవాదాయ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల వద్ద మొత్తం 87,235.39 ఎకరాల భూమి ఉండగా, ఇందులో సుమారు 20,124.03 ఎకరాలు కబ్జా అయ్యాయి. పూర్వ హైదరాబాద్ స్టేట్ పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కూడా దేవాదాయ శాఖ భూములున్నాయి. భద్రాచలం రాములవారి ఆలయ భూములు ప్రస్తుతం ఏపీ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాలతో అన్యాక్రాంతమైన భూములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొనేందుకు 2019లో దేవాదాయ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 5,050 ఎకరాలు స్వాధీనం చేసుకోగా, మరో 10వేల ఎకరాలపై వివిధ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నది.
స్వాధీనం చేసుకొన్న భూముల చుట్టూ ప్రహరీలు నిర్మించి మళ్లీ కబ్జా కాకుండా గెజిట్లో నమోదు చేయాలని నిర్ణయించారు. శాఖ భూముల్లో వెలిసిన కాలనీలు, బస్తీలు, ఇతరత్రా నిర్మాణాలతో కూడిన జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం.. ఆలయ భూముల్లో ఎన్నేండ్లు ఇతరులు కబ్జాలో ఉన్నా అవి దేవుడికే చెందుతాయి. ఒక్కసారి గెజిట్లో భూముల వివరాలు నమోదైతే కబ్జాలకు వీలుండదని, అన్యాక్రాంతమైన భూము ల జాబితా సిద్ధంగా ఉన్నదని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు.