కీసర, డిసెంబర్ 29; పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్లకు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలను అనుసరిస్తూ.. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెరియస్వామి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం 3వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. జిల్లాల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెరియస్వామి మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రామిక ప్రజలకు, ముఖ్యంగా రైతు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని అన్నారు. మోదీ ప్రభుత్వం ‘అచ్చేదిన్’ నినాదంతో ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకండ్ల కాంతయ్య, ఉపాధ్యక్షుడు సయ్యద్ అఫ్సర్, తదితరులు పాల్గొన్నారు.