బెల్లంపల్లిటౌన్, జూలై 7: లోతైన భూగర్భంలోకి కార్మికులు సునాయాసంగా వెళ్లేలా బొగ్గు ఉ త్పత్తికి వినియోగించే ఆధునిక పరిజ్ఞానం మందమర్రి ఏరియాలోని శాంతిఖనిలో అందుబాటులోకి వచ్చింది. శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్ట్ సింగరేణిలోనే అత్యంత లోతైన షాఫ్ట్గా గుర్తింపు పొందింది. శాంతిఖని మ్యాన్ వైండింగ్ షాఫ్ట్ 385 మీటర్ల లోతు వరకు ఉంది. కొత్తగూడెం ఏరియాలో వీకే 7, పీవీ కేఎస్, రామగుండం ఏరియాలో జీడీకే 10 ఇైంక్లెన్లో షాఫ్ట్లు ఉన్నాయి. ఈ షాఫ్ట్లన్నీ శాంతిఖని మ్యాన్ వైండింగ్ కంటే తక్కువ లోతులోనే ఉంటాయి. 2017లో రూ.43 కోట్లతో ఈ షాఫ్ట్ పనులను సింగరేణి డైరెక్టర్ పీపీ భాస్కర్రావు ప్రారంభించారు. 2019లో పూర్తి చేసి, మ్యాన్వైండింగ్ను ప్రారంభించారు. నేరుగా బొగ్గు ఉత్పత్తి స్థలాలకు వెళ్లేందుకు కార్మికులకు ఈ షాఫ్ట్ ఉపయోగపడుతుంది. షాఫ్ట్ ద్వారా కార్మికులకు నేరుగా 5,000 క్యూబిక్ మీటర్ల గాలి అందుతుంది.
అరగంటలోనే పని స్థలానికి..
గతంలో శాంతిఖని భూగర్భ గనిలో పని స్థలాలకు వెళ్లాలంటే 2.30 గంటలు పట్టేది. ప్రస్తుతం ఈ షాఫ్ట్తో 30 నిమిషాల్లోనే వెళ్తున్నారు. మ్యాన్ వైండింగ్లో ఒకేసారి 40 మంది కిందకు వెళ్లడంతోపాటు అదే సమయంలో మరో 40 మంది పైకి రావొచ్చు. ఆపరేటింగ్ వ్యవస్థ అంతా కంప్యూటర్లోనే ఉంటుంది. సిగ్నల్ ఇచ్చిన తర్వాత కంప్యూటర్ వద్ద ఆపరేటింగ్ ప్రారంభం అవుతుంది. మ్యాన్ వైండింగ్ వద్ద సెన్సార్లు ఉంటాయి. ఏ చిన్న తేడా వచ్చినా, దానికదే ఆగిపోతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ వినియోగిస్తున్నారు. శాంతిఖని భూగర్భ గనిలో 65 ఏండ్ల్లుగా బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, 300 మీటర్ల నుంచి 400 మీటర్ల లోతులో ఇంకా నిక్షేపాలు ఉన్నాయి. వీటిని గని లోపల 43వ లెవెల్లో అన్వేషణ విభాగం ద్వారా గుర్తించారు. 382 మీటర్ల లోతులోకి కార్మికులు వెళ్లడానికి అన్ని పనులు పూర్తి చేశారు. రూ.23 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే భారీ యంత్రాలు, హెడ్గేర్ను షాఫ్ట్ మీద నిర్మించారు. బెల్లంపల్లి రీజియన్లోనే అత్యంత పురాతనమైన శాంతిఖని గనిలో 30 ఏళ్లకు సరిపడా బొగ్గు వనరులు నిక్షిప్తమై ఉన్నాయి.