హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): గత యాసంగికి సంబంధించిన బియ్యం (సీఎంఆర్) సేకరణ గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. గత యాసంగిలో 93 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకుగాను 62.52 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలని ఎఫ్సీఐ నిర్దేశించింది. ఇందులో 54 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఎఫ్సీఐకి అప్పగించారు. మరో 8.52 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేయడంతో వాటిని బియ్యంగా మార్చేందుకు సమయం పడుతున్నదని మిల్లర్లు చెప్తున్నారు. దీనికితోడు ఎఫ్సీఐ గతంలో తనిఖీల పేరుతో సుమారు మూడు నెలల పాటు బియ్యం సేకరణ నిలిపివేసింది. గోదాములు ఇవ్వడంలోనూ, బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలించేందుకు రైలు వ్యాగన్లను కేటాయించడంలోనూ జాప్యం చేసింది. ఎఫ్సీఐ ఈ విధంగా ఇబ్బంది పెడుతుండగా.. రాష్ట్రమే సకాలంలో సీఎంఆర్ ఇవ్వడం లేదని కేంద్రం నిందలు మోపుతున్నది. సీఎంఆర్ గడువు పెంచాలని పౌరసరఫరాల శాఖ కోరిన నేపథ్యంలో మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. మిల్లుల్లో ధాన్యం ఉన్నదా? లేదా? తెలుసుకోవడానికి ఫిజికల్ వెరిఫికేషన్ చేయనున్నది. ఇప్పటికే ఎఫ్సీఐ అధికారులు పలు జిల్లాల్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ రాష్ర్టాన్ని అవమానించేలా, ఇబ్బందులకు గురిచేసేలా ఎఫ్సీఐ, కేంద్రం వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.