హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు ప్రాంతాలతోపాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో అనుమతుల్లేకుం డా జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీల పరిధిలో జీప్లస్2 వరకు మాత్రమే నిర్మాణాలకు వీలుంటుందని, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, లేఅవుట్లకు అనుమతిచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదని స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లను తనిఖీ చేయాలని, వాటికి హెచ్ఎండీఏ, టీఎస్బీపాస్ అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, రియల్టర్లతో కుమ్మక్కైనా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కమిషనర్లను హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై చేపట్టిన చర్యల వివరాలతో ఈ నెల 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. సరైన అనుమతుల్లేకుండా ఇండ్లను నిర్మించి జనానికి అంటగడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు రియల్టర్లు హెచ్ఎండీఏ ప్రాంతంలో అక్రమంగా లేఅవుట్లు వేసి, అనుమతి లేకుండా విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ ఆదేశాలు జారీచేస్తున్నామని చెప్పారు.
4వేల అక్రమ నిర్మాణాల గుర్తింపు
హెచ్ఎండీఏ అధికారులు 2019లోనే తనిఖీలుచేసి 4 వేల అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించారు. ఇటీవల వీటి సం ఖ్య బాగా పెరిగిందని, కొత్తగా వేల అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అరవింద్కుమార్ చెప్పారు.