నర్మెట, డిసెంబర్ 7: అవుట్ సోర్స్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్, అధ్యాపకుడు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఏస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల మేరకు.. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్లో 2013 నుంచి అవుట్ సోర్సింగ్ స్వీపర్గా గడ్డం రేణుక పనిచేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆమె వేతనం ఏజెన్సీ ద్వారా నెలకు రూ.13,600 వరకు వస్తుండగా, అప్పటి నుంచి ప్రిన్సిపాల్ అనురాధ ప్రతి నెల రూ.3 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది. లేదంటే వేతనం అందదని భయపెడుతున్నది.
దీంతో స్వీపర్ అకౌంట్లో పడుతున్న నగదు నుంచి ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 7 నెలలకు రూ.21 వేలకు రూ.20 వేలు ఇవ్వాలని ప్రిన్సిపాల్ చెప్పడంతో గతంలో రూ.2 వేలు ఇచ్చింది. బుధవారం రూ.18 వేలను ప్రిన్సిపాల్ సూచన మేరకు అధ్యాపకుడు మల్లేశ్కు అందించింది. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనురాధతో పాటు అధ్యాపకుడు మల్లేశ్ను విచారిస్తున్నారు. వీరిపై పూర్తి విచారణ చేసి శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.