హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వేద పారాయణదారు, అర్చక, పరిచారక పోస్టుల ఎంపిక ప్రక్రియ అభాసుపాలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో వేద పారాయణదారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణ బాధ్యత దేవాదాయశాఖ ఓ ప్రైవేట్ వేదపాఠశాల నిర్వాహకుడికి అప్పగించడం వివాదాస్పదమైంది. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఆ ప్రధాన నిర్వాహకుడు హైదరాబాద్లో వేద పాఠశాల నిర్వహిస్తూ ప్రస్తుతం ప్రభుత్వపరంగా దేవాదాయశాఖ నిర్వహిస్తున్న పరీక్షలకు నిర్ణయాధికారిగా ఉండడం ఏంటని పలువురు తెలంగాణ పండితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో లోపాయికారి ఒప్పందాలతో కొందరు ఆలయ అధికారులు, పరీక్షల నిర్వాహకులు కలిసి లక్షలు వసూలు చేస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ ’ వెలుగులోకి తెచ్చినప్పటికీ, ఈ పరీక్షల నిర్వహణే లోపభూయిష్టంగా ఉన్నదని తెలంగాణ వేదపండితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పారాయణదారుల పోస్టులకు దేవాదాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు ఈ ప్రాంతవాసులై ఉండాలనే నిబంధన ఉన్నది. అయితే, అసలు పరీక్షల నిర్వాహకులే ఈ ప్రాంతవాసులు కాకపోవడం గమనార్హం. యజుర్వేదానికి సంబంధించి పరీక్షల నిర్వాహకులుగా ఉన్నవారిలో ముఖ్య పరీక్షాధికారి తమిళనాడు మూలాలు ఉన్న వ్యక్తి కాగా, మరొకరు ఆంధ్రామూలాలు కలిగి తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు. రుగ్వేదానికి సంబంధించి ఇద్దరు తెలంగాణవారే నిర్వహిస్తుండగా, మిగతా ఇద్దరు మహారాష్ట్రకు చెందినవారు. వీరిలో కీలకమైన వ్యక్తి, పరీక్షల ప్రధాన నిర్వాహకుడు నగరంలో ఒక వేద పాఠశాల నడుపుతున్నారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఇతను ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో ముందుంటున్నాడు. యాదగిరిగుట్ట వేదపాఠశాల భూమిపూజ, కాళేశ్వరం వద్ద సరస్వతీ నది అంత్యపుష్కరాల సమయంలో ఆయన చెప్పిందే వేదం తప్ప తెలంగాణ వేదపండితులను కానీ, ఆయా ఆలయాలకు సంబంధించిన వేదపారాయణదారులు కానీ జోక్యం చేసుకోకుండా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇతనే వేద పారాయణదారుల పరీక్షలకు కీలక అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన పాఠశాలలో చదువుకున్న వారంతా ఈ పరీక్షలకు హాజరవుతుండడంతో వారికే ఉద్యోగాలు వస్తాయని, వారంతా ఏడేండ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి ఆధార్కార్డు తీసుకుని ఇక్కడివారిగా చెలామణి అవుతూ ఉద్యోగాలు దోచుకుపోతున్నారని పలువురు తెలంగాణ వేదపండితులు, అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ ప్రాంతం దేవాలయాల్లో పనిచేసే వేద పారాయణదారులు తమ ప్రాంతానికే చెందినవారుగా ఉండాలంటూ సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఒక రాజకీయనేత బహిరంగంగా ప్రకటించారు. ఇతర ప్రాంతవాసులను తమ దేవాలయాల్లో నియమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. ఇదే తరహాలో దేవాదాయశాఖ మంత్రి చొరవ తీసుకుని తెలంగాణలో జన్మించి, ఈ ప్రాంతంలోనే వేదం చదువుకుని పరీక్షలు ఉత్తీర్ణులైనవారికి ముందుగా అవకాశం కల్పించాలని తెలంగాణ పండితులు కోరుతున్నారు. తిరుమలలో వేద పండితుల పోస్టుల విషయంలో స్థానికత అంశం తెరపైకి వచ్చిందని, దీంతో ఉద్యోగాల ఎంపిక వాయిదా వేసినట్టు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక వేదపండితుడు తనకు శ్రీశైలంలో వేదపారాయణదారుగా ఉద్యోగం ఇవ్వాలని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిని కోరితే, నువ్వు తెలంగాణ వ్యక్తివి, ఇక్కడ అర్హులు లేకపోతేనే మీకు అవకాశమిస్తామని చెప్పినట్టు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో తప్ప, మిగతా అన్నిచోట్ల స్థానికతకు పెద్దపీట వేస్తుండగా తెలంగాణలో మాత్రం స్థానికేతరులకు ప్రాధాన్యమివ్వడమేంటని ఇక్కడి వేదపండితులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షల ముఖ్య నిర్వహణాధికారిగా ఓ ప్రైవేట్ వేదపాఠశాల నిర్వాహకుడికి కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ మంత్రి చొరవ తీసుకుని పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని, దేవాదాయశాఖలో పనిచేస్తున్న వేదపండితులను ముఖ్య పరీక్షాధికారులుగా నియమించి తెలంగాణ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.