హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ టీకా కేంద్రాలు.. స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బూస్టర్ కాల వ్యవధి 6 నెలలకు తగ్గించిన నేపథ్యంలో ప్రైవేట్ టీకా కేంద్రాలు అర్హులను గుర్తించి, ప్రికాషన్ డోస్ వేయాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు.
ఈ మేరకు ఆయన అన్ని రాష్ర్టాలకు లేఖలు రాసి మద్దతు కోరారు. స్పుత్నిక్-వీ మొదటి నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లోనే అందుబాటులో ఉన్నదన్నారు. స్పుత్నిక్-వీ తీసుకొన్నవారు కేవలం 0.5 శాతం మందే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వీరంతా బూస్టర్ డోస్కు అర్హులేనని పేర్కొన్నారు.