న్యూఢిల్లీ, మే 27(నమస్తే తెలంగాణ): ఓ మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పోక్సో చట్టంపై వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదవగా.. పోక్సో చట్టాన్ని మార్చేందుకు స్వామీజీల నాయకత్వంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్నదని తాజాగా చెప్పుకొచ్చారు. నేడు మహా పంచాయత్ రెజ్లర్ల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం మహిళా మహాపంచాయత్ జరుగనున్నది. ఆదివారమే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనుండగా.. అదే రోజున ఆ భవనం ముందే పంచాయత్ నిర్వహిస్తామని రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెల్లడించారు. రెజ్లర్ల ఆందోళనకు బాబా రాందేవ్ మద్దతు పలికారు. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేసి, జైలుకు పంపాలన్నారు.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు శనివారం ఢిల్లీ కోర్టుకు స్టేటస్ నివేదిక సమర్పించారు. సిట్ ఏర్పాటు చేసిన దాదాపు రెండు వారాల తరువాత రిపోర్టు అందజేశారు. సెక్షన్ 164 కింద బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 27కు కోర్టు వాయిదా వేసింది.