హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దేశంలో బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’ వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. ఇటువంటి కుట్రలో ఓ దేశ హోం మంత్రి భాగస్వామ్యం కావడం ఆ దేశానికే ప్రమాదకరమని అన్నారు. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య సాగిన సంభాషణ ఆడియో టేపులను సిసోడియా శనివారం ఢిల్లీలో విడుదల చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ఢిల్లీ బీజేపీ దూతలుగా వచ్చిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, స్వామీ సింహయాజి, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణలో ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ టేపులు శుక్రవారం దేశమంతటా వైరల్ కాగా, వాటినే సిసోడియా ఢిల్లీలో విడుదల చేశారు. ఆ ముగ్గురు దళారులు ఓ సీనియర్ ఆరెస్సెస్ నాయకునితో, ఇద్దరు కేంద్ర మంత్రులతో ఉన్న ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీసులకు చిక్కిన ఈ ముగ్గురు దళారులకు బీజేపీ కేంద్ర నాయకత్వంతో సంబంధం ఉన్నట్టు స్పష్టమవుతున్నదని అన్నారు.
ఆపరేషన్ లోటస్ పేరిట బీజేపీ దేశంలో నీచమైన క్రీడను నిర్వహిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీ దళారులు అడ్డంగా దొరికిపోయారన్నారు. ఢిల్లీలో కూడా 43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు, అందుకోసం డబ్బు సిద్ధంగా ఉంచినట్టు ఆ దళారులు చెప్తున్నారని తెలిపారు. బీజేపీ దళారుల ఆడియోల్లో నంబర్ టు షా అని, మరో కీలక నేత బీఎల్ సంతోష్ పేరును ప్రస్తావించడం స్పష్టంగా ఉందన్నారు. బీజేపీ దళారీ చెప్తున్నది అమిత్ షా గురించే అయితే.. వెంటనే ఆయనను అరెస్టు చేసి విచారించాలని సిసోడియా డిమాండ్ చేశారు. ఆపరేషన్ లోటస్ పేరిట జరిగిన కుట్రలో అమిత్ షా భాగస్వామిగా ఉంటే ఆయనన వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన ఒక బ్రోకర్ పట్టుబడటం, ఈ వ్యవహారంలో హోం మంత్రి పేరు బయటకు రావడం.. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ‘సైబరాబాద్లో ముగ్గురు తార్పుడుగాళ్లు రూ.100 కోట్లతో పట్టుబడినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ దళారుల ఫొటోలు కూడా వచ్చాయి. ఈ ముగ్గురు బ్రోకర్లు బీజేపీ ఆపరేషన్ లోటస్ను నిర్వహిస్తూ పట్టుబడ్డారు’ అని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందనేందుకు ఆడియో టేపులే సాక్ష్యమని చెప్పారు. ‘ఢిల్లీలో 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఫిరాయించేందుకు ప్రయత్నించామని ఆ దళారులు ఆడియో టేపుల్లో చెప్తున్నారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు మీరు రూ.1,075 కోట్లు సిద్ధం చేశారు. ఎవరిది ఈ డబ్బు.. ఎక్కడి నుంచి వచ్చింది?’ అని సిసోడియా నిలదీశారు. దీనిపై ఈడీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఆడియో టేపుల్లో బీజేపీ దళారులు షా, బీఎల్ సంతోష్ పేర్లను ప్రస్తావించారని సిసోడియా చెప్పారు. దేశ హోం మంత్రి అమిత్షాను ఓ బ్రోకర్ నంబర్-టూగా అభివర్ణించాడని అన్నారు.. ‘ఆపరేషన్ లోటస్ వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్షా ఉన్నారా? లేదా? తేలాలి.. ఒక వేళ ఉన్నట్టు తెలిస్తే వెంటనే అమిత్షాను అరెస్టు చేసి ప్రశ్నించాలి’ అన్నారు. ఆడియో టేపుల్లో వెల్లడైన పేర్లు ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలవేనని ఎలా నిర్ధారిస్తారు అన్న ప్రశ్నకు సిసోడియా బదులిస్తూ.. ‘ఈడీ, సీబీఐకి కొంత సమయం దొరికితే, బీఎల్ సంతోష్ ఎవరు, షా ఎవరో నిర్ధారిస్తారు’ అని అన్నారు. బీఎల్ సంతోష్ బీజేపీలో ఎంత కీలకమో అందరికీ తెలుసునని అన్నారు. ఆ బ్రోకర్ చెప్తున్నది అమిత్ షా గురించేనని స్పష్టం చేశారు.
ఆపరేషన్ లోటస్ పేరిట బీజేపీ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నదని సిసోడియా ఆరోపించారు. ఈ తరహాలో ఇప్పటికే ఎనిమిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చారని చెప్పారు. తాజాగా తెలంగాణలోనూ నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారన్నారు. అంతకుముందు పంజాబ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ లోటస్ అమలుకు ప్రయత్నించిందన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగస్టు నెలలోనే బయటపెట్టారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఆఫర్ చేశారని గుర్తుచేశారు.