హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ ఏడాది 2 లక్షలు దాటాయి. ఎప్పటిలాగే రెండు లక్షల మార్కును అధిగమించాయి. శుక్రవారం వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ వెబ్కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపుతో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అడ్మిషన్లు ముగిశాయి. ఈ ఏడాది మొదట్లో దోస్త్ మొదటి విడత అడ్మిషన్లు అంత ఆశాజనకంగా లేవు.
ఇంజినీరింగ్ అడ్మిషన్లు పెరగడం, ఫార్మసీ కోర్సుల్లోనూ సీట్లు నిండటంతో డిగ్రీకి అంత డిమాండ్ ఉండకపోవచ్చన్న వాదనలుండే. కానీ ఎట్టకేలకు 2 లక్షల మార్కును దాటడం విశేషం. ‘ఈ ఏడాది నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను ప్రవేశపెట్టాం. కొత్తగా నాలుగేండ్ల బీఎస్సీ హానర్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇలాంటి సంస్కరణల ఫలితంగా అడ్మిషన్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోగలిగాం’ అని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అధికారులు చెబుతున్నారు.
సీట్ల కేటాయింపు
డిగ్రీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ వెబ్కౌన్సెలింగ్ను చేపట్టారు. ఈ సారి 7,040మంది విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరిలో 6,843 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అధికంగా బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో 2,240, బీకాంలో 2,131 మంది సీట్లు సాధించగా, ఆర్ట్స్ కోర్సుల్లో 1,026 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 30(శనివారం)లోపు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. లేదంటే సీటు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
నేటి నుంచి ఇంట్రా కాలేజీ ైస్లెడింగ్
డిగ్రీలో ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులకు ఇంట్రా కాలేజీ ైస్లెడింగ్కు అధికారులు అవకాశం కల్పించారు. దీని ద్వారా ఇప్పటికే ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఉంటే ఆయా సీటును ఈ ైస్లెడింగ్ ద్వారా సీటు పొందవచ్చు. ఇలాంటి వారు శనివారం నుంచి అక్టోబర్ 3 సాయంత్రం 5 గంట వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకొనే అవకాశం కల్పించారు. అక్టోబర్ 4న సీట్లను కేటాయిస్తారు.