హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఏదైనా డిగ్రీ చదివిన విద్యార్థులు కొత్తగా ఆరు పీజీ కోర్సుల్లో చేరేలా ఉన్నత విద్యామండలి సీపీగెట్ అర్హతల్లో మార్పులు తీసుకొచ్చింది. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లిష్, తెలుగు కోర్సుల్లో వీరు చేరవచ్చు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో వీరికి ప్రవేశాలు కల్పిస్తారు. మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన వీసీల సమావేశం ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీలో ఏదైనా కోర్సులో చేరాలంటే సంబంధిత సబ్జెక్టును డిగ్రీలో తప్పనిసరిగా చదువాలనే నిబంధన ఉన్నది. గతంలో ఎంఏ ఆర్కియాలజీ, సోషియాలజీ, ఇస్లామిక్ స్టడీస్, జర్నలిజం, బీఎల్ఐఎస్సీ వంటి కోర్సుల్లో ఏదేని డిగ్రీ చదివిన వారు చేరేవారు. తాజా నిర్ణయంతో మరో ఆరు కోర్సుల్లో చేరే అవకాశం లభించింది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)ను ఈ ఏడాది సైతం ఓయూనే నిర్వహిస్తున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ కానున్నది.
ఇంటిగ్రేషన్ కోటా 20 శాతానికి పెంపు..
జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను మన రాష్ర్టానికి రప్పించడం, వర్సిటీల్లో చదివేలా ప్రోత్సహించేందుకు పీజీ కోర్సుల్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అడ్మిషన్లను ఐదు శాతం నుంచి 20 శాతానికి పెంచింది. పీజీ కోర్సులతోపాటు డిగ్రీ కోర్సుల్లోనూ ఈ కోటాను అమలుచేస్తారు. 20 శాతం సీట్లను జాతీయ, అంతర్జాతీయ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. ఆయా సీట్లను దోస్త్లో భాగంగా భర్తీచేయనుండగా, విద్యార్థులు ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సీట్లను భర్తీచేస్తారు. సీపీగెట్ ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. వర్సిటీలు నిర్దేశించిన ఫీజులు చెల్లించాలి. ఈ సమాచారాన్ని విద్యార్థులకు చేరవేయడం కోసం ఉన్నత విద్యామండలి వెబ్సైట్ను 27 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. సమావేశంలో కళాశాల విద్య కమిషన్ నవీన్మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, కేయూ వీసీ రమేశ్, మహాత్మాగాంధీ వీసీ గోపాల్రెడ్డి, శాతవాహన వీసీ మల్లేశ్, తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా, పాలమూరు వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ పాల్గొన్నారు.
మరికొన్ని నిర్ణయాలు