హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసిందో చెప్పుకోలేని పరిస్థితి కేంద్ర సామాజిక న్యాయ, సాధికారితశాఖ సహాయమంత్రి రాందాస్ అథవాలేకు ఎదురైంది. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో శనివారం ఆయన మీడియాకు వివిధ కేంద్ర పథకాల లెక్కలు వివరించారు.
పీఎం ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు నిర్మించినట్టు చెప్పారు. అయితే, మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమాత్రం సహాయం చేయకపోవడంతో ఆ విషయం చెప్పలేక ఇబ్బందిపడ్డారు. అనంతరం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. కేసీఆర్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.