హైదరాబాద్: నగరంలోని బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ తయారు చేసిన పీసీవీ14 వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ అనుమతి దక్కింది. 14-వాలెంట్ పీడియాట్రిక్ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ను ఇక నుంచి బీఈ సంస్థ ఇండియాలో ఉత్పత్తి చేయవచ్చు. ఆ వ్యాక్సిన్ను దేశంలో కమర్షియల్గా వాడేందుకు కూడా బీఈకి అనుమతి వచ్చింది. ఎస్.న్యూమోనియా ఇన్ఫెక్షన్ నుంచి పోరాడేందుకు పీసీవీ14 వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మూడు డోసుల్లో ఈ వ్యాక్సిన్ ఇస్తారు. 6, 10, 14 వారాల శిశువులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
భారత్తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో .. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ ద్వారా అయిదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తున్న సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే పీసీవీ14 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల.. న్యూమోనియా ఇన్ఫెక్షన్ను అడ్డుకోవచ్చు అని, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులను కాపాడుకోవచ్చు అని బీఈ సంస్థ తన ప్రకటనలో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా తమ పీడియాట్రిక్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దేశాల రెగ్యులేటరీ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల తెలిపారు.