హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. ఉదయం 11 గంటలకే భానుడు ప్రతాపాన్ని చూపుతుండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతున్నది. సోమవారం 29 జిల్లాల్లో 40 డిగ్రీలపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరిలో 39.8, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 39.7, వరంగల్లో 39.3, హైదరాబాద్లో 39.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 18.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
రాగల 5 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండ తీవ్రతతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంటి పట్టునే ఉండాలని సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, పగటి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీడపట్టున ఉండాలని సూచిస్తున్నారు. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.