కోల్సిటీ, ఆగస్టు 26: ‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి పెద్దయ్యాక ఆ కుమార్తె అరుదైన బహుమతి ఇచ్చింది. ఏకంగా చంద్రమండలంపై ఎకరం స్థలం కొనుగోలు చేసి తన తల్లి, కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో నివాసం ఉండే సింగరేణి కార్మికుడు సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె సాయి విజ్ఞత ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డది. అక్కడి గవర్నర్ కిమ్ రెనాల్డ్స్లో ప్రాజెక్టు మేనేజర్గా ఉన్నతోద్యోగం చేస్తున్నది. అమెరికాకు వెళ్లాక సాయివిజ్ఞత ఏటా మాతృ దినోత్సవం రోజున గోదావరిఖనిలో ఉంటున్న తన తల్లి వకుళాదేవికి ఏదో ఒక బహుమతి ఇస్తున్నది.
ఇంతటితో తృప్తి పడని సాయి విజ్ఞత.. ఇంత వరకూ ఎవరూ ఇవ్వలేని విధంగా.. వినూత్నంగా తన తల్లికి బహుమతి ఇవ్వాలని 2022లో అనుకున్నది. అప్పుడు లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ అనే సంస్థ చంద్రుడిపై స్థలాలను అమ్మకానికి పెట్టడంతో.. వెబ్సైట్ను చూసిన ఆమె మరుక్షణం ఆలోచించకుండా తన తల్లి వకుళాదేవి, కుమార్తె ఆర్హ పేరు మీద ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ నెల 23న చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ సేఫ్గా దిగిన రోజునే లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ సంస్థ.. సాయి విజ్ఞత కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ అంశం స్థానికంగానూ, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడంతో.. అంతరిక్షంలో కొనుగోలు చేసే భూములకు హక్కులు ఉంటాయా? భవిష్యత్తులో చంద్రుడి మీదకు మానవులు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందా? ఇంకా ఎన్నేండ్లు పడుతుంది? అంటూ నెటిజన్లు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.