బోథ్/దస్తురాబాద్ : ఆదివాసి గిరిజనులు ఎంతో పవ్రితంగా జరుపుకునే దండారి ఉత్సవాలు ముగిసాయి. దాదాపు పదిరోజుల పాటు గిరిజన గూడెంలల్లో దండారి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. బోథ్, దస్తురాబాద్ మండలాల్లోని గిరిజన గూడేల్లో ఆదివారం చివరి రోజు గుస్సాడీలు డప్పుల చప్పుళ్ల నడుమ నృత్యాలు చేశారు . అనంతరం గ్రామ పటేళ్ల ఇండ్ల ముందు గుస్సాడీ వేషధారణ వస్తువులు ఉంచి కోలాబోడి పూజలు చేశారు. ఆచారం ప్రకారం మహిళలు, గారెలు, నైవేధ్యాలతో గ్రామ సమీపంలోని దేవతలకు పూజలు చేశారు.
అనంతరం గుస్సాడీలకు స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగిసాయి. బోథ్ మండలంలోని అందూర్, మందబొగుడ, నాగాపూర్, పార్డీ (బీ), నిగిని, కంటెగాం, జీడీపల్లె, పట్నాపూర్, బాబెర తదితర గ్రామాలు, దస్తురాబాద్ మండలంలోని పలు గోండు గూడాల్లో ఉత్సవాలను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేడ్మా మాన్కు, గ్రామ పటేల్ వేడ్మా తిరుపతిమంజుల, గ్రామ ఆదివాసి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.