హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను అభివృద్ధి చేయాలనే మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ పథకం ఎందరో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గడచిన తొమ్మిదేండ్లలో రాయితీల రూపంలో రూ.2,650 కోట్లకుపైగా సహాయం అందించగా, దాదాపు 58 వేలమందికిపైగా దళిత, గిరిజన బిడ్డలకు లబ్ధి చేకూరింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరో 8000 మందికి రూ. 562 కోట్ల చెక్కులు పంపిణీ చేయనున్నారు. దీంతో రాయితీ మొత్తం రూ.3,212 కోట్లకు చేరనున్నది.
దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీం) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకొనేందుకు దళిత, గిరిజన వర్గాలతోపాటు వికలాంగులకు పెట్టుబడిలో 35 శాతం (గరిష్ఠంగా రూ.75 లక్షల వరకు) వరకు రాయితీ కల్పిస్తున్నారు. మహిళలకు మరో 10 శాతం అదనంగా రాయితీ ఇస్తున్నారు. టీ-ప్రైడ్ కింద స్టాంప్ డ్యూటీ, పవర్ కాస్ట్, వడ్డీల రీయింబర్స్మెంట్, పెట్టుబడి రాయితీ తదితరవాటితోపాటు అదనంగా టీఎస్ఐఐసీ అభివృద్ధి చేస్తున్న పారిశ్రామికవాడల్లో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం, డైరెక్ట్ ఫండింగ్, మార్జిన్ మనీ, భారీ పరిశ్రమలతో సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడం, అదనపు పెట్టుబడి రాయితీలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. టీ-ప్రైడ్ ద్వారా ఇప్పటివరకు 58,198 మంది లబ్దిపొందగా, మరో 8000 మందికి చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంబేద్కర్ జయంతి రోజు రూ.562 కోట్లు పంపిణీ
ఈ ఏడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా మరో 8000 మంది లబ్ధిదారులకు రూ.562 కోట్ల రాయితీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీ-ప్రైడ్ ద్వారా లబ్ధిపొంది పరిశ్రమల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు కూడా అందించనున్నారు. పరిశ్రమల శాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. ఈ 8 వేలమందితో కలుపుకొంటే టీ-ప్రైడ్ లబ్ధిదారుల సంఖ్య 66,000లకు చేరనుండగా, రాయితీల ద్వారా కల్పించిన మొత్తం రూ.3,212 కోట్లకు చేరుతుంది.
22 మందికి ఉద్యోగాలిచ్చా
నేను 2018లో రూ.80 లక్షల పెట్టుబడితో చర్లపల్లి పారిశ్రామికవాడలో మసాలాల తయారీ కంపెనీని ఏర్పాటు చేశాను. ప్రభు త్వం నుంచి 35 శాతానికిపైగా రాయితీ లభించింది. ఎక్కడా, ఎటువంటి సమస్య ఎదురుకాలేదు. అనుమతుల దగ్గరినుంచి, రాయితీలు అందించేవరకు అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. పరిశ్రమ స్థాపించాలనే సంకల్పం ఉన్నవారికి ప్రభుత్వం ఎంతగానో సహకారం అందిస్తున్నది. నేను స్వయంగా ఉపాధి పొందుతూ 22 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇందులో 10 మంది మహిళలు ఫ్యాక్టరీలో మసాలాల తయారీ పనుల్లో ఉండగా, మిగిలిన 12 మంది యువకులు మార్కెటింగ్ చేస్తున్నారు. కరోనా సందర్భంగా వ్యాపారం కొంత మందగించినప్పటికీ ఇప్పుడు ఫరవాలేదు.
– వినోద, శ్రీమల్హరీ మసాలాస్, చర్లపల్లి
కేటీఆర్ చొరవతో విరివిగా సహాయం
మంత్రి కేటీఆర్ చొరవతో టీ-ప్రైడ్ పథకం ద్వారా దళితులకు విరివిగా రాయితీలు లభిస్తున్నాయి. 2016లో రూ.2.5 కోట్లతో రూఫింగ్ షీట్స్ తయారీ పరిశ్రమను ప్రారంభించాను. నా కంపెనీలో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నా. టీఎస్ఐఐసీ ద్వారా రాయితీలో భూమి కేటాయించారు. ప్రభుత్వం ద్వారా రూ.75 లక్షల రాయితీ ఇచ్చింది. దరఖాస్తు చేసుకొన్న తరువాత పెద్దగా జాప్యం లేకుండానే భూ కేటాయింపు, రుణాలు, రాయితీలు మంజూరయ్యాయి. గతంలో ప్రభుత్వం నుంచి ఏ చిన్న లబ్ధి పొందాలన్నా ఎన్నో ఏండ్లు ఆఫీసులచుట్టు తిరగాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆ పరిస్థితి లేదు. అన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో జరుగుతున్నాయి.
– మునీందర్, ఒమేగా రూఫింగ్ ఇండస్ట్రీస్, జీడిమెట్ల