Dalit Bandhu | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దళితుల సముద్ధరణకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం రెండోవిడతను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 1,100 మంది చొప్పున మొత్తం 1.30 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తొలి విడతలో హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామం, చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా దళితబంధును అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని విస్తరించింది. తద్వారా తొలి విడతలో 38,323 దళితకుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేసింది. దీంతో వారంతా వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థిక పురోగతి సాధిస్తున్నారు.
రెండో విడత టార్గెట్ 1.30లక్షలు
దళితబంధుకు 2023-24 బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం.. రెండో విడతలో ఈ పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీంతో హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 కుటుంబాల చొప్పున మొత్తంగా 1,29,800 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలు కలిపి మొత్తంగా 1.30 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు.
ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ
దళితబంధు పథకాన్ని కట్టుదిట్టగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్తోపాటు యాప్ను కూడా రూపొందించింది. మొదటి విడతలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను ఇప్పటికే యూనిట్లవారీగా ఆన్లైన్లో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు కింద ఎన్ని గ్రామాల్లో ఎంతమంది లబ్ధి పొందారు? వారి పేర్లు? ఎంచుకున్న యూనిట్లు? ఎప్పుడు ప్రారంభించారు? వాటి పురోగతి ఎలా ఉన్నది? తదితర అంశాలన్నీ ఆన్లైన్లో పొందుపరిచారు. రెండో విడతలోనూ ఈ పథకం అమలు తీరును ఆన్లైన్ ద్వారానే పర్యవేక్షించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తారు. ఆ వివరాలతో కలెక్టర్లకు జాబితా అందజేశాక వారు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి అర్హులను ఎంపిక చేస్తారు. ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచిన తర్వాత ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తుంది. తదనంతరం యూనిట్ల గ్రౌండింగ్ చేపట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
సీఎం కేసీఆర్.. అభినవ అంబేద్కర్
దళితబంధు రెండో విడత అమలు కోసం ఉత్తర్వులు జారీచేసిన సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు కృతజ్ఞతలు తెలిపారు. దళితజాతి అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ను అభినవ అంబేద్కర్గా అభివర్ణించారు.
వచ్చే ఎనిమిదేండ్లలో ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి: కొప్పుల
దళితబంధు పథకం రెండో విడతను ప్రారంభించేందుకు ప్రభు త్వం అనుమతించడంపై సాంఘిక సంక్షేమశాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లబ్ధిదారుల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే తొలి విడతలో దళితబంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు గౌరవప్రదంగా జీవిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద రానున్న ఎనిమిదేండ్లలో ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. విపక్షాలు ఇకనైనా విమర్శలు చేయడాన్ని మానుకోవాలని కోరారు. రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు.