నారాయణరావుపేట/సిద్దిపేట, ఫిబ్రవరి 6: దేశమే ఆశ్చర్యపోయేలా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. కమలం పార్టీ నాయకులకు దమ్ముం టే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేయించాలని సవాల్ విసిరారు. దళితులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, వారికి రూ.10 లక్షల చొప్పున అందజేసి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం సిద్దిపే ట జిల్లా నారాయణరావుపేట మండలం బంజరుపల్లి లో దళితబంధు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సంచార జాతుల్లో అత్యంత వెనుకబడిన వీరబద్రీయ, వీర ముష్టి, హోలియ దాసరి కులాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ ఆటోలను అందజేశారు. ఈ సం దర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దళితుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని పునరుద్ఘాటించా రు. ‘మన ఊరు-మన బడి’తో ఎక్కువగా లబ్ధిపొందేం ది ఎస్సీ, ఎస్టీ, మధ్యతరగతి కుటుంబాలేనని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని వెల్లడించారు.
రైతులపై ధరల భారం
సబ్సిడీలు రద్దు చేస్తూ, ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులు, సామాన్యులపై భారం మోపుతున్నదని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ నిర్ణయాలు తీసుకొంటున్నదని మండిపడ్డారు. రాష్ట్ర జీఎస్డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేదని, ఇప్పుడు బావుల కాడ మీటర్లు పెట్టకపోతే అందులో అర శాతానికి కోత పెడతామని హెచ్చరిస్తున్నదని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో రాష్ర్టానికి రూ.5 వేల కోట్లు కోత పడినట్టు మంత్రి ఆరోపించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బాయిలకాడ మీటర్లు పెట్టనని కేసీఆర్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. మీటర్లు వద్దు, బీజేపీ వద్దు, మనకు కేసీఆర్ ముద్దు అని ప్రజాక్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా టీఆర్ఎస్ కార్యకర్తలు వివరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాశర్మ తదితరులు పాల్గొన్నారు.