సూర్యాపేట : బీజేపీలో కష్టపడే నాయకులకు , కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని సూర్యాపేట బీజేపీ దళిత మోర్చా(Dalit Morcha) జిల్లా అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్ ఆరోపించారు. పార్టీ అవలంభిస్తున్న విధానాలను, వైఖరినీ నిరసిస్తూ తన పదవికి రాజీనామా(Resign) చేసినట్లు వెల్లడించారు. త్వరలో మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) సమక్షంలో తనతో పాటు మరికొందరు బీఆర్ఎస్(BRS)లో చేరనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్ల పాటు బీజేపీలో క్రియశీలంగా పనిచేసినా తగిన గుర్తింపు లేదని వాపోయారు. సూర్యాపేట నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు కేవలం టీఆర్ఎస్ వాళ్లకే వస్తాయన్న అపోహలు అవాస్తవమని పేర్కొన్నారు. దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, కల్యాణలక్ష్మి (Kalyanalaxmi) పథకాలు, ఇంటింటికీ భగీరథ నీరు అందిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటుతో చిన్న తరహా పరిశ్రమలు నిలదొక్కుకుంటున్నాయని చెప్పారు. ఎస్డీఎఫ్ నిధులతో చర్చిల అభివృద్ధి చేశారని తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డిని మూడోసారి గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన వారిలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు బలుగూరి రాజు, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి సోమ గాని లక్ష్మణ్, మహేందర్, మహేష్ తదితరులు ఉన్నారు.