‘కవ్వమాడినచోట కరువు ఉండదు’ అంటారు. ‘నూటొక్క కుంటలు.. కోటొక్క లింగాలు’ అని గొప్పగా చెప్పుకొనే ఆ గ్రామంలో కుంటలు ఎండినా.. పాల కొలనులు పారుతున్నాయి. రోజూ రెండువేల లీటర్ల పాల ఉత్పత్తితో కరువు నేల కనకమయమవుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఒక్కో కుటుంబం డెయిరీలకు 6 నుంచి 50 లీటర్లు అమ్ముతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. పాల ఉత్పత్తిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతున్నది.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రక ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక పాల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తున్నది. జైనమందిరంతోపాటు, కోటి లింగాల ఆలయంతో ప్రాశస్త్యాన్ని పొందిన ఈ గ్రామం నుంచి రోజూ రెండువేల లీటర్ల పాలు డెయిరీలకు అందుతున్నాయి. పూర్వకాలంలో రాజులు కొలనుపాక చుట్టూ నూటొక్క కుంటలను నిర్మించినట్టు చరిత్రకారులు చెపుతున్నారు. కాలక్రమంలో అవి కనుమరుగైపోగా.. ఉన్న కొద్దిపాటి కుంటల కింద నేడు వర్షాధారంగా పంటలు సాగుచేస్తున్నారు. నాలుగువేల కుటుంబాలున్న గ్రామంలో ప్రజలు క్షీర విప్లవం సృష్టిస్తున్నారు. ప్రతిరోజూ 30 వేల లీటర్ల పాల ఉత్పత్తితో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా.. రెండువేల లీటర్లతో ‘కొలనుపాక’ ప్రత్యేక గుర్తింపును పొందుతున్నది.
2,350 లీటర్ల ఉత్పత్తి
కొలనుపాక పశు సంపదకు పెట్టింది పేరుగా మారింది. గ్రామంలో 386 ఆవులు, 623 బర్రెలు ఉన్నాయి. రైతులు అరెకరం నుంచి ఎకరం వరకు పశుగ్రాసం సాగు చేస్తుంటారు. ఒక్కో కుటుం బం డెయిరీలకు 6 లీటర్లు నుంచి గరిష్ఠంగా 50 లీటర్ల వరకు పాలు పోస్తున్నారు. గ్రామంలో 2,350 లీటర్లకుపైగా పాల ఉత్పత్తి జరుగుతుండగా.. రెండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు డెయిరీలు 2 వేల లీటర్లను సేకరిస్తున్నాయి. పన్నీరు తయారీదారులు మరో 100 నుంచి 200 లీటర్లు తీసుకెళ్తుంటారు. కొన్నేండ్లుగా గ్రామస్తులు పాల ఉత్పత్తిపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. యువత ఎక్కువగా పాడితోనే ఉపాధి పొందుతున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు 1.42లక్షల లీటర్ల పాలను సరఫరాచేసి కొలనుపాక నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తుల సహకారం సంఘం (నార్ముల్ డెయిరీ)లో రికార్డు సృష్టించింది.
అగ్రగామి ఆలేరు
నార్ముల్ డెయిరీ పరిధిలో భువనగిరి నియోజవర్గంలో 14 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా.. ఆలేరు నియోజకవర్గంలో 30 వేల లీటర్లు ఉత్పత్తి అవుతున్నది. ఆలేరు పరిధిలో ఏర్పాటుచేసిన ఆలేరు చిల్లింగ్ కేంద్రం నుంచి రోజూ 8,200, వంగపల్లి కేంద్రం 3,200, తుర్కపల్లి సెంటర్ 3,300, రాజాపేట 3 వేలు, బొందుగుల 2,600, రఘునాథపురం నుంచి 3 వేల లీటర్ల చొప్పున సేకరిస్తున్నారు. మరో 7 వేల లీటర్లను రైతులు ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. నార్ముల్ డెయిరీ ద్వారా 15రోజులకోసారి రూ.2 కోట్ల వరకు బిల్లులు పొందుతున్నారు. ప్రతిరోజూ 30 వేల లీటర్ల పాలు ఉత్పత్తి కావడం రాష్ట్రంలోనే అత్యధికమని చెప్తున్నారు.
కోడి కూతతోనే పశువుల పాకకు
కోడికూతతోనే నిద్ర లేచి పశువుల పాకకు వెళ్తాం. పాలు పితకడం.. కేంద్రానికి తీసుకెళ్లడంతోనే మా దినచర్య మొదలవుతుంది. ఆరో తరగతి చదువుతున్నప్పటినుంచే పాడి పరిశ్రమలోకి అడుగుపెట్టా. గతంలో 15 లీటర్ల పాలు వచ్చేవి. ప్రస్తుతం 8 లీటర్ల వరకు పోస్తున్నాం. నెలకు 10వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందుతున్నాం. – దొంతిరి
శంకర్రెడ్డి, రైతు, కొలనుపాక
నెలకు 30వేలకుపైనే ఆదాయం
2008కి ముందు హైదరాబాద్లో ప్రైవేటుగా జాబ్చేసేవాడిని. కుటుంబానికి పొలం ఉండటంతో ఊర్లోకి వచ్చి సొంతంగానే డెయిరీ పెట్టుకున్న. 8 బర్రెలు ఉన్నాయి. గరిష్ఠంగా 50 లీటర్ల వరకు పాలు అమ్మేవాడిని. పెట్టుబడి ఖర్చులు పోను రూ.30 వేలకుపైనే మిగులుతున్నది. పాల వ్యాపారంతో లాభాలు తప్పితే నష్టాలు అనేవి ఉండవు. – పోతు వినయ్, యువకుడు, కొలనుపాక
పాడితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా
మాకు మూడు ఆవులు, ఒక బర్రె ఉన్నాయి. డెయిరీకి పాలుపోయడం ద్వారా నెలకు 6 వేల వరకు ఆదాయం వస్తున్నది. వ్యవసాయం కంటే పశుపోషణనే మమ్ములను ఆదుకుంటున్నది. దీనిద్వారా పొందుతున్న ఆదాయమే ఆదరువుగా నిలుస్తున్నది. పాలు అమ్ముకోవడం ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. – బొబ్బ కళమ్మ, మహిళా రైతు, కొలనుపాక
ఈ ఏడాది రికార్డు స్థాయి ఉత్పత్తి
కొలనుపాకలో ఏటా పాల ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది 1.42 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి కొలనుపాక పాల డెయిరీ నల్లగొండ- రంగారెడ్డి డెయిరీలోనే అగ్రస్థానంలో నిలిచింది. 15 రోజులకోసారి బిల్లులు చేతికి రావడం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో డెయిరీకి పాలు వెల్లువలా వస్తున్నాయి. పాల ఉత్పత్తిలో కొలనుపాక రైతుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటున్నది.
– దొంతిరి సోమిరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్, కొలనుపాక