హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజీలేమిటీ, విమాన టికెట్ ధరలు తదితర అంశాల గూర్చి గూగుల్పై ఆధారపడుతుంటారు. ఆయా వెబ్సైట్లలోకి వెళ్లి కాంటాక్టు నంబర్లకు కూడా ఫోన్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్లను కొందరు బుట్టలో పడేస్తున్నట్టు ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి.
తొమ్మిది మంది కుటుంబాలతో జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లాలని టూరిజం ప్యాకేజీ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. ఎగ్జిబర్ట్కశ్మీర్ అనే వెబ్సైట్లో ఈ వివరాలను గుర్తించారు. ఇందులో ఉన్న కాంటాక్ట్సుతో మట్లాడారు. ఆరు రోజు ప్యాకేజీ ట్రిప్ రూ.3.75 లక్షలు చెప్పారు. ఢిల్లీ వరకు రావాలని అక్కడి నుంచి మొత్తం వాహనాలు, భోజనం, వసతి తమదేనని ఆరు రోజులపాటు అన్ని తామే చూసుకొంటామని చెప్పారు. ముందుగా డబ్బు చెల్లించాలని సూచించారు. పర్యటన తేదీలు చెప్పి బాధితులు రూ.3.75 లక్షలు చెల్లించారు. డబ్బు చెల్లించిన తరువాత అప్పటిదాక మాట్లాడిన ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి.
అమర్నాథ్ యాత్రకు వెళ్లాలని గూగుల్ చేసిన బాధితులు క్రియేటింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెబ్సైట్లోకి వెళ్లి, టూర్ ప్యాకేజీకి రూ.50వేల అడ్వాన్స్ చెల్లించారు. తీరా రేపు విమానం ఎక్కి వస్తున్నామని బాధితులు చెప్పగా, ఎక్కడికొస్తారు? అమర్నాథ్ యాత్ర బంద్ అయ్యిందని ఫోన్లు స్విచాఫ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్పై ఆధారపడి ప్యాకేజీలు బుక్ చేయవద్దని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు. నమ్మకమైన, పేరున్న ట్రావెల్స్ను ఎంచుకోవాలని పేర్కొన్నారు.