హైదరాబాద్: ఓ సైబర్ చీటర్ సోషల్ మీడియాలో పలువురికి లింకులు పంపి ఆ లింకులను ఓపెన్ చేసిన వారి ఖాతాల నుంచి కోట్లల్లో నగదు కొల్లగొట్టాడు. దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ పేరుతో లింకులు పంపి ఏకంగా రూ. 400 కోట్లు దండుకున్నాడు. ఈ కొట్టేసిన మొత్తాన్ని విదేశాలకు తరలించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు రోనాక్ భరత్ కాకడే ఆటకట్టించారు. అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
సైబర్ చీటర్స్ సోషల్ మీడియాలో లింకులు పంపడం ద్వారా ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే రోజుకు లక్షల్లో కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోనాక్ భరత్ మన దేశంలో అనేక మంది బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి, వందల సంఖ్యలో ఏజంట్లను నియమించుకుని వారి పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృస్టించాడు. వాటి ద్వారా లింకులు పంపుతూ మోసాలకూ పాల్పడ్డాడు. ఇలా సైబర్ క్రైమ్స్ ద్వారా వచ్చిన డబ్బులను కూడా ఫేక్ బ్యాంకు అకౌంట్స్కి బదిలీ చేసి, వాటి ద్వారా చైనా, తైవాన్ దేశాలకు ట్రాన్స్ఫర్ చేశాడు.
కోట్ల రూపాయలను బిట్ కాయిన్ రూపంలో నకిలీ అకౌంట్ల ద్వారా చైనా, తైవాన్లరే బదిలీచేశాడు. ఇలాంటి లింకులు ఓపెన్ చేసి మోసపోయిన ఓ హైదరాబాదీ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితుడు రోనాక్ భరత్ను ముంబైలో అరెస్ట్ చేశారు. భరత్ మీద దేశ వ్యాప్తంగా 50 కేసులు ఉన్నట్లు గుర్తించారు.