దుబ్బాక టౌన్, ఏప్రిల్ 28 : విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్ర ప్రభుత్వం.. ఆ విషయంలో ఘోరంగా విఫలమైందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కానీ, నల్ల చట్టాలను మాత్రం తెచ్చి రైతులను వ్యవసాయ రంగానికి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్కారు దవాఖానలను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యసేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు రైతులను ముంచే ఆలోచనే చేస్తున్నదన్నారు.
ఈ యాసంగిలో ధాన్యం కొనబోమని చేతులెత్తేస్త్తే.. ఆర్థిక భారమైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మందుకు వచ్చిందన్నారు. యాసంగిలో పండేది బాయిల్డ్ రైస్ అని తెలిసినా కేంద్రం కావాలనే కొర్రీలు పెడుతున్నదని దుయ్యబట్టారు. పండని పంటను కొంటామని బీజేపీ ఝూటా మాటలు మాట్లాడుతున్నదని విమర్శించారు. ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ సర్కారు వ్యవసాయ రంగానికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పది మంచి పనులు చేస్తే.. బీజేపీ సర్కారు పెట్రో, డీజిల్ ధరలను పెంచి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. బాయిల కాడ మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
ఆయిల్పామ్ సాగు పెంచాలి..
ఏటా లక్ష కోట్ల రూపాయల విలువైన పామాయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్పామ్ సాగు లాభదాయకమని, నిరంతరం ఆదాయం వస్తుందన్నారు. జూలై నుంచి ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతుకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వబోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలిపారు.
మనం ప్రజా సేవకులం
‘మనమంతా ప్రజా సేవకులం. వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్న’దని మంత్రి హరీశ్రావు వైద్యాధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి పీహెచ్సీ నూతన భవన నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మంత్రి మాట్లాడారు. పెద్దాపరేషన్ చేసి గర్భసంచి తీసే వ్యాపారం చేయవద్దని సూచించారు. అలాంటివి బంద్ కావాలన్నారు. మహిళల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యతను తీసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారు.