CTET | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షను జూలై, ఆగస్టులో నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, మే 26 తుది గడువు అని వెల్లడించింది. కాగా, ఈసారి తెలంగాణలో ఉన్న ఆరు పరీక్ష కేంద్రాలను నాలుగుకు కుదించారు. నల్లగొండ, కరీంనగర్ కేంద్రాలను తొలగించి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ పరీక్ష కేంద్రాలను మాత్రమే కేటాయించారు.
రాష్ట్రంలో రెండు సీటెట్ పరీక్షాకేంద్రాలను తొలగించడం సరికాదని తెలంగాణ డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి తెలిపారు. దీనివల్ల వేలాది మంది అభ్యర్థులకు నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈసారి రాష్ట్రంలో సీటెట్ రాసే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని, కాబట్టి పరీక్ష కేంద్రాలను పెంచాలని రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు.