హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక వైద్యసేవలకు గాంధీ దవాఖాన చిరునామాగా మారుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గాంధీలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ను శనివారం ప్రారంభించిన మంత్రి త్వరలో క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అనంతరం ఐసీయూ, ఇతర విభాగాలను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. దవాఖానలో సమస్యలు, సదుపాయాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ దవాఖాన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటివరకు రూ.176 కోట్లు విడుదల చేసిందని, ఇందులో రూ.100 కోట్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మరో రూ.76 కోట్ల పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని తెలిపారు. రూ.12.5 కోట్లతో ఎంఆర్ఐ, రూ.6.5 కోట్లతో నూతన క్యాథ్ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మరో నెలన్నర రోజుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రసూతి, మాతాశిశు సేవల కోసం గాంధీలో 200 పడకల ఎంసీహెచ్ నిర్మిస్తున్నామని, ఐదారు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
కరోనా సమయంలో గాంధీ దవాఖాన సిబ్బంది అద్భుతంగా సేవలు అందించారని మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. 84,127 మంది కరోనా రోగులకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని కొనియాడారు. ప్రైవేట్ దవాఖానలు చేతులెత్తేసిన సమయంలో ప్రజలను గాంధీ దవాఖాన ఆదుకున్నదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టంచేశారు. 11 రిస్ దేశాలనుంచి 3,235 మంది హైదరాబాద్కు వచ్చారని, వారిలో 15 మందికి వైరస్ పాజిటివ్గా తేలిందని వివరించారు. జీనోమ్ సీక్వెన్సింగ్లో 13 మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉన్నదని వెల్లడించారు. ప్రతి ఒకరూ మాసు ధరించాలని, టీకా రెండు డోసులు వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీఎంఈ రమేశ్రెడ్డి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
‘ఏమ్మా, బాగున్నావా? చికిత్స ఎలా ఉన్నది. డాక్టర్లు, నర్సులు రోజు వస్తున్నారా, మందులు అన్ని ఇచ్చారా? భోజనం రుచికరంగా ఉంటున్నదా, వార్డును రోజు శుభ్రం చేస్తున్నారా?’ అని మంత్రి హరీశ్రావు రోగులను ఆప్యాయంగా పలుకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
‘వైద్యం చేయడంలో సమస్యలు ఉన్నాయా, పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నా యా? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? సలహాలు ఇవ్వండి.’ అని పీజీ వైద్యులను మంత్రి కోరారు. నెఫ్రాలజీ విభాగంలో ఆర్వో వాటర్ ప్లాంట్ కావాలని కోరగానే, వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.