హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన సీఎం కేసీఆర్ ముందుగా గన్పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ప్రముఖులైన 30 మంది కవులచే కవి సమ్మేళనం రవీంద్ర భారతిలో నిర్వహించనున్నట్లు సీఎస్ వెల్లడించారు.
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ కార్యదర్శి రవిగుప్త, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్, జల మండలి ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతోపాటు పోలీసు, రోడ్లు భవనాలు, విద్యుత్, సమాచార శాఖ, ఉద్యాన వన శాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.