RRR | హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చి.. సెప్టెంబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్రంలోనే ప్రాధాన్యం సంతరించుకుందని.. ఈ ప్రాజెక్ట్కు సబంధించి వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. భూసేరణ పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం అందేలా జిల్లాస్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కోర్టు కేసులపై సైతం ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. సమీక్షకు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవిన్ మిట్టల్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.