CS Shanti Kumari | గ్రూప్-3 పరీక్షల ఏర్పాట్లు, వరి-పత్తి కొనుగోళ్ల పురోగతి, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభం, సామాజిక ఆర్థిక సర్వే తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 5.36 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-3 పరీక్షలకు హాజరవుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ద్వారా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రూప్-1 పరీక్షల మాదిరిగానే గ్రూప్-3 పరీక్షలను కూడా సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు స్వయంగా పర్యవేక్షించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు ఉండేలా చూడాలని, ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పరీక్షల నిర్వహణకు కమిషన్ చేసిన ఏర్పాట్లను సంక్షిప్తంగా వివరించారు. పరీక్షలను పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రస్తావిస్తూ, కలెక్టర్లు వరిధాన్యం రాకను ప్రతిరోజూ నిశితంగా పరిశీలించాలని.. వరి దిగుబడికి అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు.
గోదాములకు ధాన్యం రవాణా చేయాలని, త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్లను కోరారు. ప్రత్యేక అధికారులు తమ నిర్దేశిత జిల్లాల్లో వరి తరలింపును పర్యవేక్షించాలని, సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా సమస్యలను పరిష్కరించి రైతుల్లో విశ్వాసాన్ని నింపాలని, అధికారులందరూ తప్పనిసరిగా ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆమె ఆదేశించారు. కొత్తగా మంజూరైన నర్సింగ్, పారామెడికల్ కాలేజీలకు సంబంధించి మిగిలిపోయిన మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సామాజిక ఆర్థిక కులాల సర్వే సజావుగా జరిగినందుకు కలెక్టర్లను ఆమె అభినందించారు.