Mahila Shakti | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. క్యాంటీన్ సర్వీస్ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళాసంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్టు వివరించారు. రెండేండ్లలో 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణపై గ్రామ సమాఖ్య సంఘాలకు శిక్షణ ఇచ్చి, వాటికే అప్పగించనున్నట్టు తెలిపారు.
క్యాంటీన్ల పనితీరు, నిర్వహణకు అవసరమయ్యే స్థలం, రోడ్మ్యాప్ అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రన్ను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ కమిషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, టూరిజంశాఖ డైరెక్టర్ నిఖిల, కార్పొరేషన్ ఎండీ రమేశ్నాయుడు తదితరులు పాల్గొన్నారు.