హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై సాధించిన పురోగతిని పరిశ్రమల శాఖ అధికారులతో ఆమె శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఆహార, వ్యవసాయ రంగంలో ప్రతి జిల్లాలో డిమాండ్, సాధ్యాసాధ్యాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు.
పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ ఉన్న ఏడు ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ప్రోత్సాహానికి వ్యూహాన్ని రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలని, వచ్చే నాలుగైదు నెలల్లో వాటికి భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మిడ్మానేరు రిజర్వాయర్లో ఆక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.