చేర్యాల/సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు.
మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్థంబం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.
సిద్దిపేట జడ్జీ ప్రత్యేక పూజలు
కొమురవెల్లి మల్లన్నను సిద్దిపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జీ సంతోష్కుమార్ కుటంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.