Credit Card | కీసర, ఫిబ్రవరి 17: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదనే సాకుతో సిబ్బంది పెట్టిన వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులేనని సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కీసర ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేట ప్రాంతానికి చెందిన రాగుల సురేశ్ (45), భాగ్య (40) దంపతులు బతుకుదెరువు కోసం కొన్నేండ్ల క్రితం కీసరకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఏండ్ల సౌషిక్ (17), భవన్ (15) ఉన్నారు. టాటా క్రెడిట్ లిమిట్స్ అనే సంస్థ నుంచి మూడేండ్ల క్రితం రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని ఓ ప్లాట్ను సురేశ్ దంపతులు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరు నెలల క్రితం రాంపల్లిలోని ఆర్ఎల్నగర్ కాలనీకి వెళ్లి నివాసం ఉంటున్నారు. క్రెడిట్ సంస్థకు అప్పులో కొంత డబ్బు చెల్లించారు.
ఇంకా రూ.3-4 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. ఈ క్రమంలో నాలుగు నెలలుగా తరచూ క్రెడిట్ కార్డు సిబ్బంది సురేశ్ నివాసానికి వచ్చి పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా మళ్లీ వచ్చి బిల్లు చెల్లించడం లేదంటూ నానా ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయం ఆ కాలనీవాసులకు తెలియడంతో తమ ఇజ్జత్ పోయిందని తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శుక్రవారమే తమ పిల్లలను సురేశ్ దంపతులు అమ్మమ్మ ఇంటికి పంపించారు. ‘మా ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులేనని’ సూసైడ్ నోటు రాశారు. శనివారం ఉదయం టిఫిన్లో విషం కలుపుకొని పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.